ఇంటర్ పరీక్షలలో కొవిడ్ నిబంధనలు
– విద్యార్థులకు మాస్కులు తప్పనిసరి
– పరీక్షాకేంద్రాల వద్ద వైద్య సేవలు, శానిటైజర్ సౌకర్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఈనెల 25 నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్ పరీక్షల్లో కరోనా నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి జిల్లా కలెక్టర్, ఇంటర్ బోర్డు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. వికారాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షల కోసం 29 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9239 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కరోనా తగ్గుముఖం తరువాత ప్రభుత్వం పరీక్షలను నిర్వహిస్తోంది. అన్ని కేంద్రాలలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పరీక్షా కేంద్రాల వద్ద థర్మల్ స్ర్కీనింగ్, ప్రథమ చికిత్సకు వైద్యులు, అంబులెన్స్లను అందుబాటులో ఉంటాచని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జ్వరం లక్షణాలు ఉన్నవారికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని సూచించింది. పరీక్ష రాసేందుకు వచ్చే విద్యార్థులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది.
పకడ్బందీ ఏర్పాట్లు
మరోవైపు పరీక్షల కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లను చేశారు. అన్ని కేంద్రాలకు చీఫ్ సూపరిండెంట్లు, ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, 144 సెక్షన్ను అమలులో ఉంటుందని అధికారులు వెల్లడించారు.


