సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తికి చిన్నారి లేఖ

తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్

సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తికి చిన్నారి లేఖ
– బ‌స్సు సౌక‌ర్యాన్ని పున‌రుద్దరించాలి విజ్ఞ‌ప్తి
– స్పందించిన న్యాయ‌మూర్తి, ఆర్టీసీ ఎండీకి ఆదేశం
– బ‌స్సు స‌ర్వీసునును ప్రారంభించిన టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనర్
హైద‌రాబాద్‌/రంగారెడ్డి జిల్లా : త‌న‌తోపాటు తోటి విద్యార్థుల ఇబ్బందుల‌ను వివ‌రిస్తూ ఓ బాలిక సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తికి లేఖ రాసింది. రోజూ బ‌డికి వెళ్లేందుకు గ‌తంలో ఉన్న బ‌స్సు స‌ర్వీసును పున‌రుద్దించాల‌ని లేఖ ద్వారా విజ్ఞ‌ప్తి చేసింది. ఇందుకు న్యాయ‌మూర్తి స్పందించ‌డంలో గ్రామానికి బ‌స్సు సౌక‌ర్యం అందుబాటులోకి వ‌చ్చింది. ఇందుకు సంబంధించిన వివ‌రాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం చిదేడ్ గ్రామానికి చెందిన పి.వైష్ణ‌వి ఎనిమిదో తరగతి చదువుతుంది. త‌న సోద‌రుడు ప్ర‌ణీత్ తొమ్మిదో తరగతి చదుతున్నాడు. ఇద్ద‌రు ఊరికి ఆరు కి.మీ దూరంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళుతుండ‌గా.. త‌న సోద‌రి ప్రీతి 18 కిలో మీట‌ర్ల దూరంలో ఉన్న కాలేజీకి వెళుతుంది. రోజూ తమ గ్రామం నుంచి పాఠశాలకు వెళ్లిరావడానికి అటో చార్జీలు రూ. 150.అవుతున్నాయని, తమ తండ్రి కరోనా మొదటి దశలో గుండెపోటుతో చనిపోయారని, అమ్మ చిన్న ఉద్యోగం చేస్తూ తమను పోషిస్తోందని బాలిక
వైష్ణ‌వి సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తి ఎన్వీ ర‌మ‌ణకు లేఖ రాసింది. బడికి వెళ్లే సమయంలో, తిరిగి వచ్చే సమయంలో బస్సులు లేవని లేఖలో వివరించింది. ఉదయం ఏడింటికి బస్సు ఉండటంతో కొందరు తెల్లవారుజామునే లేచి బడికి వెళుతున్నారని.. తిరిగివచ్చేందుకు సాయంత్రం 6.30కు బస్సు ఉండటంతో స్కూలు వదిలినా కూడా గంటన్నర దాకా వేచి చూడాల్సి వస్తోందని. ఇంటికొచ్చేసరికి రాత్రి 7 గంటలవుతోందని ఇబ్బందులను వెల్లబోసుకుంది. విద్యాసంస్థల వేళలకు అనుగుణంగా గతంలో ఉన్న బస్సును పునరుద్ధరిస్తే తమ సమస్యలు తొలగుతాయని. ఆ మేరకు ఆర్టీసీ బస్సును తిరిగి ప్రారంభించడానికి సహాయం చేయాలని లేఖలో విజ్ఞప్తి చేసింది.

స్పందించిన న్యాయ‌మూర్తి
బాలిక రాసిన లేఖ‌పై న్యాయ‌మూర్తి ఎన్వీ ర‌మ‌ణ స్పందించారు. బుధవారం బాలిక రాసిన లేఖ‌ను చ‌దివి సుప్రీం కోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎస్కీ రాజేజాకు ఆదేశాలు జారి చేశారు. ఈ మేర‌కు అసిస్టెంట్ రిజిస్టార్ ఎస్కీ రాజేజా బస్సును పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనారకు లేఖ రాశారు. ఇందుకు ఎండి స‌జ్జ‌నార్ కూడ స్పందించ‌డం వెంట‌నే గ్రామానికి బ‌స్సు స‌ర్వీసును పున‌రుద్ద‌రించారు. ఇబ్రహీంపట్నం డిపో బస్సు (రూట్ నంబరు 406) ఇబ్రహీంపట్నం నుంచి చీదేడ్ మీదుగా దాతుపల్లి వరకు ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 5గంటలకు,రాత్రి 9గంటలకు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. గ్రామానికి బ‌స్సు సౌక‌ర్యం అందుబాటులోకి రావ‌డంతో బాలిక వైష్ణ‌విని గ్రామ‌స్తులంద‌రు అభినందించగా.. రాసిన లేఖ‌కు స్పందించిన న్యాయ‌మూర్తి ఎన్వీ ర‌మ‌ణ గారికి బాలిక కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.