బీఆర్ఎస్ నాయకులపై కేసు
– మురళీగౌడ్ నివాసంపై దాడి ఘటనలో 6 మంది అరెస్ట్
– ప్రకటించిన పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మరికొందరిపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి మంళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో తాండూరు పట్టణంలోని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ నివాసంపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, మరికొందరు నివాసంపై దాడి చేసిన సంఘటన తాండూరులో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడికి పాల్పడిన వారిని అక్కడి నుంచి తరిమేశారు. ఈ సంఘటనపై అర్ధరాత్రి మురళీకృష్ణ గౌడ్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు మంగళవారం ఉదయం పట్టణ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్, అధికారులు విచారణ చేపట్టారు. దాడికి పాల్పడిన బీఆర్ఎస్ నాయకులు, మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో అనిల్ బాండ్, జావేద్, అక్బర్, సంజీవ్, అబ్రార్ , అంతారం రాజులను అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. చట్ట ప్రకారం వారిని కోర్టులో హాజరు పరుస్తామని ఓ ప్రకటనలో చెప్పారు.

