మారేడుతో రోగాలన్నీ మాయం..!
– కీళ్ల వ్యాధులు, జీర్ణ సమస్యలకు చెక్
– మొలలకు మంచి మందు
దర్శిని డెస్క్: మారేడు అంటే బిల్వపత్రంలో ఆరోగ్యాన్ని పెంచి రోగాలను మాయం చేసే శక్తివంతమైన ఔషదాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి. కీళ్ల సంబంధ వ్యాధులను, విరేచనాలను తగ్గిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను వృద్ధిచేస్తుంది. శరీర దుర్వాసనను తగ్గిస్తుంది. అనేక ఔషధాల తయారీలో ఉపయోగపడుతుంది.
మారేడు ఆకుల కషాయాన్ని కాచుకుని తాగితే హైపవర్ ఎసిడిటీ లాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. మారేడు ఆకుల కషాయాన్ని నువ్వుల నూనెతో కలిపి కాచి, దానిని తలస్నానానికి ముందుగా రాసుకుంటే తలస్నానం చేసిన తర్వాత జలుబు, తుమ్ములు వచ్చేవారికి బాగా ఉపయోగపడుతుంది. బిల్వ ఆకులు జ్వరాన్ని తగ్గిస్తాయి. బిల్వ ఆకుల కషాయము తీసి అవసరము మేరకు కొంచం తేనె చుక్కలు కలిపి తాగితే జ్వరము తగ్గుతుంది. కడుపు లోను, పేగులలోని పుండ్లు తగ్గించే శక్తి బిల్వ ఆకులకు, ఫలాలకు ఉన్నది. మలేరియాను తగ్గించే గుణము బిల్వ ఆకులకు , ఫలాలకు ఉన్నది. బిల్వ ఫలం నుండి రసం తీసి దానికి కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే రక్తసంబంధిత ఇబ్బందులనుండి ఉపశమనం కలుగుతుంది. బిల్వ వేరు, బెరడు, ఆకులను ముద్దగా నూరి గాయాల మీద అద్దితే త్వరగా మానుతాయి.
మారేడు పండ్లలో శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణం ఉంది. అలాగే విరేచనకారిగా కూడ పనిచేస్తుంది. సగం పండిన పండు జీర్ణ శక్తిని పెంచుతుంది. బాగా పండిన పండులోని గుజ్జు రోజూ తింటే దీర్ఘకాలికంగా మలబద్ధ సమస్యతో సతమతమయ్యే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. మారేడు గుజ్జుని పాలు, పంచదారతో కలిపి తీసుకుంటే వేసవి పానీయంగా కూడా బావుంటుంది. ప్రేగులను శుభ్రపరచడమే కాకుండా, వాటిని శక్తివంతంగా కూడా తయారుచేస్తుంది. మారేడులో ఉన్న విచిత్రం ఏమిటంటే బాగా పండిన పండు విరేచనకారిగా ఉపయోగపడితే, సగంపండిన పండు విరేచనాలు ఆగటానికి ఉపయోగపడుతుంది. జిగురు విరేచనాలవుతున్నా సగం పండిన మారేడు పండు ఎంతో ఉపకరిస్తుంది. విరేచనాలు తగ్గడానికి గుజ్జుగా కంటే ఎండబెట్టి, పొడుము గా చేసినది బాగా ఉపకరిస్తుంది.
ఇదికూడా చదవండి…

