నూపుర్ శర్మపై తాండూరులో ఎఫ్ఐఆర్
– రాష్ట్రంలోనే మొదటి సారి నమోదు
తాండూరు, దర్శిని ప్రతినిధి: బీజేపీ నాయకురాలు నూపుర్ శర్మపై తాండూరులో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో ఆమెపై తాండూరులో మొదటిసారి కేసు నమోదు చేశారు. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు నూపుర్ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దేశ వ్యాప్తంగా ముస్లిం సోదరులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. గత నెల 30న తాండూరులో కూడ ముస్లిం వెల్పేర్ అసోసియేషన్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం నూపుర్ శర్మపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అసోసియేషన్ అధ్యక్షులు బాబర్ ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం తాండూరు పోలీస్టేషన్లో నూపుర్ శర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెక్షన్ 295-ఎ, 153ఎ, 505(2) ల కింద కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే తాండూరులో మొదటిసారి కేసు నమోదు చేయడం గమనార్హం. అయితే ముస్లిం మనోభావాలను దెబ్బతీసిన బీజేపీ నాయకురాలు నూపుర్ శర్మను అరెస్టు చేయాలని ముస్లిం వెల్పేర్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.



