జనగామాకు మన్నించవా మూవీ టీం రాక
– 10 విచ్చేస్తున్న హీరో హీరోయిన్లు, చిత్రబృందం
– చిత్ర నిర్మాత మంజుల యాదవ్ సొంత గ్రామంలో ఈవెంట్
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన కళా అభిరుచి కలిగిన వారు సినిమా ప్రపంచంలో అడపా దడపా రాణిస్తున్నారు. తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలోని జనగాం గ్రామానికి చెందిన చుక్క మంజుల యాదవ్ నిర్మాణ సారధ్యంలో మన్నించవా అనే చిత్రాన్ని రూపొందించారు. రామరాజ్యం మూవీ మేకర్స్, అనంతలక్ష్మీ ప్రొడక్షన్స్ నేతృత్వంలో ఆనేగౌని రమేష్ గౌడ్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం హీరో హీరోయిన్లు జనగామలో సందడి చేయబోతున్నారు. ఈనెల 28న రాష్ట్ర వ్యాప్తంగా సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈనెల 10వ తేదిన పెద్దేముల్ మండలంలోని జనగాం గ్రామంలో పాట విడుదల ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామానికి చెందిన ప్రొడ్యూసర్ చుక్క మంజుల ‘మన్నించవా’ అనే సినిమాను చిత్రీకరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈనెల 10(సోమవారం) సాయంత్రం 5 గంటలకు జనగాంలో ఏర్పాటు చేసిన ఈవెంట్లో హీరోగా నటించిన శివ మల్హోత్రా, హీరోయిన్గా నటించిన అనుశ్రీలు ఈవెంట్కు హాజరు కాబోతున్నారని తెలిపారు. ఈవెంట్లో భాగంగా ‘ కుంభమేళ’ అనే పాటను విడుదల చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా గ్రామీణ స్థాయి నుంచి సినిమా నిర్మాత వరకు ఎదిగిన చుక్క మంజులను గ్రామం తరపున సన్మానిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మండలంతో పాటు, జిల్లాలోని అభిమానులు, ప్రజాప్రతినిధులు, యువకులు, నాయకులు హాజరై విజయవంతం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

