ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
– జర్నలిస్టులకు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పిలుపు
– కలెక్టర్ను కలిసిన తాండూరు యువ జర్నలిస్టులు
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి: ప్రభుత్వ శాఖల అధికారులు, జర్నలిస్టులు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ నారాయణ రెడ్డి గారిని శుక్రవారం జిల్లా కలక్టరేట్లో పెద్దేముల్ మండల జర్నలిస్టులు గౌస్(నమస్తే తెలంగాణ), రమేష్(మన తెలంగాణ) మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు కలెక్టర్ నారాయణ రెడ్డిని శాలువా, పూలమలతో ఘనంగా సన్మానించారు. ముందుగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కర్ణాటక సరిహద్దు పెద్దేముల్ మండలం నుంచి వచ్చామని కలెక్టర్ గారికి చెప్పడంతో ఆప్యాయంగా పలకరించి, ప్రాంత విశేషం అడిగారు. కాగా, జర్నలిస్టులు గౌస్, రమేష్ మండల పరిధిలోని పలు ప్రాంతాల గూర్చి, సమస్యల గురించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షల మేరకు నిర్ణయాలు ఉంటాయన్నారు. సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని జర్నలిస్టులకు కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధాన కర్తగా ఉండాలని సూచించారు.

