తాత తడబడలేదు..!
– వృద్ధుడిపై నుంచి వెళ్లిన రైలు
– పట్టాలపై పడుకున్న మసలోడు
– చిన్నగాయం లేకుండా తప్పిన ప్రమాదం
దర్శిని డెస్క్: డెభ్బై ఏళ్ల వృద్ధుడు ధైర్యాన్ని ప్రదర్శిస్తూ సూపర్ అనిపించుకున్నాడు. రైలు పట్టాల మీద పడుకుని రైలు మీద నుంచి వెళ్లినా ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. బిహార్లోని గయా జిల్లా ఫతేపుర్ మండలంలోని మోర్హే గ్రామానికి చెందిన బాలో యాదవ్ (70) పహాడ్పుర్ రైల్వేస్టేషనులో పట్టాలు దాటబోయాడు. ఇంతలో స్టేషనులో నిలిచి ఉన్న గూడ్స్ రైలు అకస్మాత్తుగా కదిలింది. దీన్ని గమనించిన ప్రయాణికులు పట్టాలపై పడుకోమని వృద్ధుడికి వినిపించేలా కేకలు వేశారు. వెంటనే అప్రమత్తమైన బాలో యాదవ్ ఏమాత్రం తడబాటు లేకుండా పట్టాలపై పడుకున్నాడు. రైలు వెళ్లిపోయేదాకా అలాగే ఉన్నాడు. అనంతరం కర్ర సహాయంతో లేచి ఏమీ జరగనట్లు వెళ్లిపోయాడు. ప్లాట్ఫాంపై ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో అతడికి చిన్నగాయం కూడా కాలేదు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది.


