కోడంగల్పై చర్చ..!
– పాలమూరు విలీనంపై రచ్చ
– కొత్త డివిజన్ మార్పుకు డిమాండ్
– సీఎం నియోజకవర్గంలో ఏం జరుగుతుందంటే..?
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలోని సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కోడంగల్పై జోరుగా చర్చ జరుగుతోంది. కోడంగల్ నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో మహబూబ్నగర్ జిల్లాలో కలిపేందుకు సాధ్యాసాధ్యాల కసరత్తులపై పుకార్లు రావడం చర్చనీయాంశంగా మారింది. ఇది సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2016 అక్టోబర్ 12న చిన్న జిల్లాలు ఏర్పడగా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను ఐదు జిల్లాలుగా విభజించారు. ఈ జిల్లా పరిధిలోని షాద్నగర్ నియోజకవర్గాన్ని పూర్తిగా పాలమూరు జిల్లా నుంచి విడదీసి రంగారెడ్డి జిల్లాలో కలిపారు.
కల్వకుర్తి నియోజకవర్గంలోని కొన్ని మండలాలను నాగర్కర్నూల్ జిల్లా పరిధిలోకి తీసుకొచ్చి మిగతా మండలాలను రంగారెడ్డి జిల్లాలో కలిపారు. అంతేగాక కొన్ని నియోజకవర్గాల మండలాలను ఆయా జిల్లాల్లో కలపడంతో నియోజకవర్గ కేంద్రాలు ఒకవైపు, మండలాలు మరోవైపు అయ్యాయి. ప్రస్తుతం వీటిని సరిచేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావటంతో అధికారులు నియోజకవర్గ స్వరూపాన్ని జిల్లాల పరిధి నుంచి మార్చే దిశగా కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ను మహబూబ్నగర్ జిల్లాలో కలిపేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. గత ప్రభుత్వంలో కొడంగల్ను వికారాబాద్ జిల్లాలో కలిపారన్నారు గురునాథ్ రెడ్డి.
ఈ నిర్ణయాన్ని స్థానిక నిరుద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. కోడంగల్ను వికారాబాద్ జిల్లాలోనే కొనసాగించాలని, పాలమూరులో కలపొద్దని డిమాండ్ చేస్తున్నారు. పాలమూరులో కలిపితే చార్మినార్ జోన్ నుంచి జోగులాంబ జోన్లో కలవాల్సి వస్తుందని, అలా జరిగితే ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇదిలా ఉంటే స్థానికు ప్రజా ప్రతినిధులు, మేధావులు మాత్రం కోడంగల్ను కొత్త జిల్లాగా, డివిజన్ కేంద్రంగా మార్చాలని అభిప్రాయపడుతున్నారు. దీంతో కోడంగల్ నియోజకవర్గంలోపై అందరి దృష్టి పడింది. ఈ పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి…

