విద్యుత్ షాక్కు యువరైతు బలి
– సర్వీసు వైరు సరిచేస్తుండగా ప్రమాదం
– కుప్పకూలీ మృతి చెందిన రైతు
– యాలాల ముద్దాయిపేట్లో విషాధం
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యుత్ షాక్కు గురై ఓ యువరైతు బలైపోయాడు. పొలం పనుల్లో భాగంగా సర్వీసు వైరును సరిచేస్తుండగా విద్యుద్ఘాతానికి గురై ప్రాణాలు విడిచాడు.

ఈ సంఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలం ముద్దాయి పేట గ్రామంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పోలేపల్లి రమేష్ (38) తన పది గుంటల వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నాడు.

శుక్రవారం ఉదయం పొలానికి నీళ్లు పెట్టాలనే ఇంటి నుంచి వెళ్లాడు. పొలం వద్ద సర్వీస్ వైరు కింద పడి ఉండడం గమనించి దానిని సరిచేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్ గురై అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయాడు. క్షణాల్లోనే ప్రాణాలు విడిచాడు. రమేష్ మృతితో అతడి భార్య గౌరమ్మ, కొడుకు ప్రదీప్, కుమార్తె శ్రీజ అనాధలయ్యారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. యువ రైతు మృతితో గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి.

ఇదికూడా చదవండి….

