సునితారెడ్డి పర్యటనకు భంగం
– శిలాఫలాకాన్ని ద్వంసం చేసిన దుండగులు
– పెద్దేముల్ మండల కేంద్రంలో ఘటన
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునితారెడ్డి పర్యటనకు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు భంగం కలిగించేయత్నం చేశారు. అభివృద్ధి పనుల ప్రారంభం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలాకాన్ని దుండగులు ద్వంసం చేశారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన నిమిత్తం పెద్దేముల్ మండలంలో సునితారెడ్డి పర్యటన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పెద్దేముల్ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ను చైర్ పర్సన్ సునితారెడ్డి ప్రారంభించాల్సి ఉంది. అధికారులు, నాయకులు ఇందుకు తగిన ఏర్పాట్లను కూడ చేశారు. అయితే శుక్రవారం ఉదయం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బైకుపై వచ్చి శిలాఫలాకాన్ని ధ్వంసం చేసి పారిపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న తాండూరు రూరల్ సీఐ జలందర్ రెడ్డి పెద్దేముల్కు చేరుకుని ధ్వంసమైన శిలాఫలాకాన్ని పరిశీలించారు.
గ్రామానికి చెందిన కొందరిపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా రాజకీయ కక్ష్యతోనే కొందరు వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.

