రూ. 10 నాణెం చలామణికి ఆర్టీసీ ఓకే
– క్షేత్రస్థాయి అమలుకు ఆదేశమిచ్చిన ఎండీ సజ్జనార్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : భారత రిజర్వ్ బ్యాంకు నుంచి విడుదలైన రూ. 10 రూపాయిల నాణెం చలామణిలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నాణెలు చెల్లడం లేదని పుకార్లు వ్యాపించడంతో కిరాణ దుకాణ వాల్లు, ఇతర వ్యాపారస్తులు పది రూపాయల నాణేలను తీసుకోవడం లేదు. ఇకపై ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ శుభవార్త చెప్పింది. తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా రూ. 10 నాణేల చలామణిపై కీలక ప్రకటన చేశారు. ప్రయాణికులు ఎలాంటి అనుమానం లేకుండా రూ.10 నాణేలను ఆర్టీసీ బస్సుల్లో వినియోగించుకోవచ్చని ప్రకటించారు. టికెట్ తీసుకునే సమయంలో ప్రయాణికులు ఇచ్చే రూ.10 నాణేలు తీసుకోవాలని కండక్టర్లకు తెలియజేయాలని రాష్ట్రంలోని అన్ని డిపోల అధికారులను ఆదేశించారు. ఇక ఎండీ సజ్జనార్ నిర్ణయంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

