కార్మికుల ఆకలికేకలు పట్టించుకోండి
– జిల్లా కలెక్టరేట్ ముందు మున్సిపల్ కార్మికుల దర్నా
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల ఆకలికేకలు పట్టించుకోండని ఏఐటీయూసీ నాయకులు అన్నారు. కార్మికుల డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా మంగళవారం కార్మికులు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఏఐయూటీసీ రాష్ట్ర నాయకులు ఏసురత్నం, జిల్లా కన్వినర్ విజయలక్ష్మీ పండిత్లు హాజరై కార్మికులతో కలిసి నిరసన కొనసాగించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ ఎజెండాపై చైర్ పర్సన్ కోర్టుకు వెళ్లడంతో కార్మికులకు పెంచిన వేతనాలు అమలు కావడం లేదన్నారు. దీంతో పాటు 18 మందికి వేతనాలు అందడంలేదన్నారు. వేతనాలు సక్రమంగా అందగా కార్మికులు ఆకలి కేకలకు గురవుతున్నారని, ఈ విషయంలో జిల్లా కలెక్టర్ స్పందించి కార్మికులకు న్యాయం చేయాలన్నారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
అనంతరం అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఐయూసీ నాయకులు ఎం. గోపాల్, నర్సింలు, గోపాల్, వెంకటేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

