ఆ రెండు పార్టీలో చేరడం లేదు..!
– కొత్త పార్టీ ఏర్పాటుపై ఆలోచన
– లేదంటే కారును ఎదుర్కొనే పార్టీలో చేరతా
– మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. కాంగ్రెస్లో చేరే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. ఆదివారం నాడు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని తాను కలవలేదని తేల్చి చెప్పారు. కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో భేటీ అయ్యానని తెలిపారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురం చర్చించుకున్నామని తెలిపారు. రాజుగోపాల్ రెడ్డిని మినహా కాంగ్రెస్ ఇతర నేతలను ఎవరినీ కలవలేదని, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ప్రస్తుతం తాను ఏ రాజకీయ పార్టీలో లేనని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను తటస్థంగా ఉన్నానని ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీలోకి చేరాలని కోరుతున్నారని, అయితే అధికార టీఆర్ఎస్లు ఎదుర్కొనే పార్టీలోకి వెళ్లాలా..? లేక కొత్తగా పార్టీ పెట్టాలా..? అనే విషయంపై సమాలోచనలు చేస్తున్నానని తెలిపారు. లేదంటే టీఆర్ఎస్ను ఎదిరించే పార్టీలో చేరుతానని స్పష్టంగా పేర్కొన్నారు.

