దోస్త్ పిలుస్తోంది..!

కెరీర్ తాండూరు వికారాబాద్

దోస్త్ పిలుస్తోంది..!
– తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన కోర్సులు
– ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : రాష్ట్ర ప్ర‌భుత్వం ఇంట‌ర్ అర్హ‌త‌తో డిగ్రీలో ప్ర‌వేశాల‌కు డిగ్రీ ఆన్‌లైన్ స‌ర్వీసెస్ తెలంగాణ‌(దోస్త్) ద్వారా నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసింది. ఈ మేర‌కు తాండూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. 2022-23 విద్యా సంవ త్సరానికి సంబంధించి దోస్త్ ప్రకటన వెలువడి నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రవీందర్ తెలిపారు. ఈమేరకు కళాశాలలో జిల్లా స్థాయి సహాయ కేంద్రాన్ని ప్రిన్సిపాల్ ప్రారంభించడం జ‌రిగింద‌న్నారు. కళాశాల దోస్త్ సమన్వయ కర్త ఎస్.మహేందర్రెడ్డి మాట్లాడుతూ సహాయక కేంద్రం ద్వారా ప్రవేశం సులువుగా ఉంటుందన్నారు. పేర్ల నమోదు, ఆధార్ ధ్రువీకరణ, వెల్ఆప్షన్ నమోదు తదితర సేవలు పొందవచ్చన్నారు. డిగ్రీలో చేరడానికి ఆన్లైన్లో ప్రవేశాలు పొందే విద్యార్థులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అందుబాటులో నూత‌న కోర్సులు
డిగ్రీ ప్ర‌వేశాల‌ను దృష్టిలో ఉంచుకుని నూతన కోర్సులను ప్రవేశపెట్టారు. బీఎస్సీ(ఫిజికల్సన్స్), బీఎస్సీ(లైఫ్ సైన్సెస్), బీకాం కంప్యూటర్ అప్లికేషన్, బీఏ( కంప్యూటర్ అప్లికేషన్), బీఏ ( మాస్ కమ్యూనికేషన్ మరియు జర్నలిజం), బీఏ (సోషియాలజీ, ఆంధ్రోపాలజీ, సైకాలజీ, జియోగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) వంటి కోర్సులను ప్రారంభించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రవీందర్ తెలిపారు. కాగా, ఈ కోర్సులకు సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం కళాశాలలో అధ్యాపకులతో కలిసి ఆవిష్కరించారు.

కళాశాలలో అత్యాధునిక డిజిటల్ ల్యాబ్ సౌకర్యం
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వర్చువల్ తరగతులు, హైస్పీడ్ ఇంటర్ నెట్ సౌకర్యం, హై స్పీడ్ నెట్వర్క్ కలిగిన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, అన్ని సబ్జెక్టులకు సంబంధించి అత్యాధునిక ప్రయోగశాలలు, స్పోర్ట్స్ రూం సౌకర్యం, ఆన్లైన్ వెబినార్, సెమినార్, మూక్స్ కోర్సును బోధించేందుకు వర్చువల్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రిన్సిపాల్ తెలిపారు.