అదరగొట్టిన బాలకవులు
– తెలంగాణ జాగృతి సమ్మేళనంలో ప్రతిభ
– అభినందించిన జాగృతి జిల్లా సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: కవిత్వాలు, పద్యాల పఠనంలో వికారాబాద్ జిల్లా బాల కవులు అదరగొట్టారు. వజ్రోత్సవాలలో భాగంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన బాల కవుల సమ్మేళనంలో ప్రతిభను కనబరిచారు. గురువారం హైదరాబాద్లోని కింగ్ కోఠి తెలంగాణ సారస్వత పరిషత్లో నిర్వహించిన కవి సమ్మేళనంలో తెలంగాణ జాగృతి జిల్లా బాద్యులు కుమ్మరి శ్రీనివాస్, తాండూరు నియోజకవర్గ కన్వినర్ దత్తాత్రేయల నేతృత్వంలో తాండూరు, వికారాబాద్ లోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పద్యాలు, కవిత్వాలు పఠనా ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తాండూరులోని సెయింట్ మేరిస్ హైస్కూల్కు చెందిన విద్యార్థినిలు మహీరా భేగం రాష్ట్ర హిందీ కవి సమ్మేళనంలో ప్రథమ స్థానంలో నిలిచింది.

ఆమెతో పాటు పలు పాఠశాలల విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాలకవులకు తెలంగాణ సాహిత్య అకాడమిక్ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, తెలంగాణ పుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారిలు సత్కారం చేశారు. మెమోంటోలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జాగృతి జిల్లా బాధ్యులు కుమ్మరి శ్రీనివాస్, తాండూరు కన్వినర్ దత్తాత్రేయలు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఖండాంతరాలు దాటి విదేశాల్లో విస్తరింపజేస్తున్న తెలంగాణ జాగృతి సేవలు అమూల్యమైనవని అన్నారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత, జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రదర్శనలో మెరిసిన బాలకవులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల బాలకవులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు మున్నురు రాజు, అంజిలప్ప, ప్రశాంత్ పాటీల్ తదితరులు పాల్గొన్నారు.


