వీధి కుక్కల దాడుల నియంత్రణకు సహకరించండి
– జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో భయాందోళన కలిగిస్తున్న వీధి కుక్కల దాడి నియంత్రణకు సహకరించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు కోరారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నారాయణ రెడ్డిని వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత తాండూరులో బాలికపై కుక్క దాడి చేసిన ఘటనను గుర్తుచేశారు. తాండూరులో వీధి కుక్కల బెడద అధికంగా ఉందన్నారు. గత ఏడాది మే 17వ తేదిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కుక్కల నియంత్రణకు తీర్మానించడం జరిగిందని గుర్తుచేశారు. అయితే బడ్జెట్ అంశంపై సమస్యలు తలెత్తడంతో నియంత్రణ చర్యలు ఆగిపోయాయని తెలిపారు. ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపించి వీధి కుక్కుల నియంత్రణకు పరిష్కారం చూపాలని కలెక్టర్ను దీపా నర్సింలు కోరారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు ఆమె పేర్కొన్నారు.

