నవోదయ స్కూళ్లలో నోటిఫికేషన్
– ఆరో తరగతిలో ప్రవేశాలకు అవకాశం
– ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే…?
దర్శిని డెస్క్: దేశంలోని నవోదయ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆరో తరగతిలో ప్రవేశాలకు అవకాశం కల్పించింది. 2024-25 విద్యా సంవత్సరంకు సంబంధించి ఈ నోటికేషన్ను విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా 649 జేఎన్వీల్లో 6వ తరగతి సీట్ల భర్తీకి రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా నవంబర్ 4(శనివారం)న ఉదయం 11.30గంటలకు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో, 2024 జనవరి 20 (శనివారం) తేదీన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ ప్రవేశ పరీక్ష(Jawahar Navodaya Vidyalaya selection test) నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ పరీక్షకు అర్హులైన విద్యార్థులు ఆగస్టు 10వరకు https://navodaya.gov.in/nvs/en/Home1 వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. నవోదయలో ప్రవేశం పొందడానికి విద్యార్థి మే 1, 2012 నుంచి జులై 31, 2014 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో తప్పనిసరిగా నివాసి అయి ఉండాలని స్పష్టం చేసింది. 2023-24 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతుండాలని, 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంత పాఠశాలల్లోనే చదివి ఉండాలని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించగా.. మిగిలిన 25శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు.
దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..?
ఆన్లైన్లో JNV అధికారిక వెబ్సైట్ https://navodaya.gov.in/nvs/en/Home1 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనేందుకు అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్లో అభ్యర్థి వివరాలను పేర్కొంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన సర్టిఫికెట్ సాఫ్ట్ కాపీని అప్లోడ్ చేయడం తప్పనిసరి. దీంతో పాటు అభ్యర్థి ఫొటో, అభ్యర్థి, తల్లిదండ్రుల సంతకాలు, ఆధార్ వివరాలు/ నివాస ధ్రువపత్రాల అవసరం ఉంటుంది.
పరీక్ష ఇలా..
నిర్ణీత తేదీల్లో ఉదయం 11.30గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు రెండు గంటల పాటు జరిగే ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. మొత్తం 80 ప్రశ్నలు ఇస్తారు. దీంట్లో మెంటల్ ఎబిలిటీ నుంచి 40 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. దాంతో పాటు అర్థమెటిక్ నుంచి 20 ప్రశ్నలకు 25 మార్కులు; లాంగ్వేజ్ టెస్ట్ 20 ప్రశ్నలకు 25 మార్కుల చొప్పున ఇస్తారు. మెంటల్ ఎబిలిటీకి గంట సమయం ఉండగా.. మిగతా రెండింటికీ చెరో అర్దగంట పాటు సమయం ఇస్తారు.
ఎంపిక ఎలా ఉంటుందంటే..?
జవహర్ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు(మెంటల్ ఎబిలిటీ, అరిథ్మెటిక్, లాంగ్వేజ్) ఉంటాయి. మొత్తం 80 ప్రశ్నలు 100 మార్కులకు 2 గంటల సమయంలో ప్రవేశ పరీక్ష ఉంటుంది. ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు. రెండు విడతల్లో నిర్వహించే ఈ పరీక్ష ఫలితాలను వచ్చే ఏడాది మార్చి/ఏప్రిల్లో విడుదల చేసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి….


