ఈ నెల 27న జరిగే భారత్ బంద్ ను జయప్రదం చేయండి
తాండూరు, దర్శిని ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 27న చేపట్టిన భారత్ బంద్ను జయప్రదం చేయాలని కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్, ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శనివారం తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెడ్పిటిసి ధార సింగ్, తెలంగాణ జన సమితి కౌన్సిలర్ సోమశేఖర్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విజయలక్ష్మి పండిత్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె. శ్రీనివాస్ తదితరులు విలేకరులతో మాట్లాడారు. అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ పిలుపులో భాగంగా సెప్టెంబర్ 27 న జరిగే దేశవ్యాప్త భారత్ బందన్ను చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
మోడీ ప్రభుత్వం తెచ్చిన 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని, నూతన విద్యుత్ సవరణల బిల్లును ఉపసంహరించుకోవాలని, కార్మికవర్గ హక్కులను కాలరాసే లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, ఆదివాసులు తదితర ప్రాంతాల్లో సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని వారు కోరారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకొని కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు నియంత్రించి, నిత్యావసర సరుకులు ధరలు అయినా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇటీవల కురిసిన వర్షాల మూలంగా పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు . ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జనార్దన్ రెడ్డి, అలీమ్, బీసీ సంఘం కన్వినర్ రాజ్కుమార్, సయ్యద్ షుకూర్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, వెంకటయ్య, మునీర్ తదితరులు పాల్గొన్నారు.

