బీసీల అభ్యున్నతి మార్గదర్శకులు మాణిక్ రావు
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
– జయంతిలో బీసీ సంఘం నేతల నివాళులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీల అభ్యున్నతికి మార్గం చూపిన మహా నాయకుడు స్వర్గీయ మాణిక్ రావు అని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు.

శుక్రవారం మాణిక్ రావు 95వ జయంతి సందర్భంగా తాండూరు పట్టణం చించొల్లి రోడ్డు మార్గంలో ఉన్న మాణిక్ కావు విగ్రహానికి కందుకూరి రాజ్ కుమార్ బీసీ సంఘం నేతలతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కోసం స్వర్గీయ మాణిక్ రావు చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. 1978లోనే అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్ల అంశాన్ని ధైర్యంగా లేవనెత్తారని గుర్తుచేశారు.

బీసీల అభ్యున్నతికి ఆయన వేసిన బాటలే నేటికి మార్గదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. అదేవిధంగా 1964లో శాసనమండలి సభ్యులుగా, 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి.. 3 నెలల జైలు శిక్ష అనుభవించిన విషయాలను గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పీవీ నర్సింహారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఉన్న హాయాంలో 14 ఏండ్లు మంత్రిగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, విధాన మండలి సభ్యులుగా పనిచేసి తాండూరు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడుగా నిలిచారని అన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, మహిళ అధ్యక్షురాలు అనిత, జిల్లా మహిళ నాయకురాలు నర్సమ్మ, ఉపాధ్యక్షురాలు మంజుల, విజయలక్ష్మీ, కార్యదర్శి జగదీశ్వరి, బీసీ యువత నాయకులు రాము ముదిరాజ్, మంతటి రాజు, దుబాయి వెంకట్, అంజి, రాజు, హరిప్రసాద్, విఘ్నేష్, ప్రహాల్లాద తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

