ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన భార్య
– కామారెడ్డి జిల్లాలో కలకలం
– నిందితుడు వికారాబాద్ వాసి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ఓ మహిళ ప్రియుడి సాయంతో భర్తను హత్యచేసింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. ప్రియురాలుతో కలిసి ఘాతుకానికి పాల్పడిన నిందితుడు వికారాబాద్ జిల్లా వాసిగా తెలిసింది. వివరాలిల్లోకి వెళితే కర్ణాటకకు చెందిన 26 ఏళ్ల రమేశ్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కొత్తగా నిర్మిస్తున్న ఓ ఇంటికి వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. రమేశ్ భార్య పేరు వెన్నెల, ఆమె వయస్సు సుమారు 25 ఏళ్లు ఉంటుంది.

ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో వికారాబాద్కు చెందిన దస్తప్ప అనే వ్యక్తితో రమేశ్ భార్యకు అక్రమ సంబంధం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని భావించిన వెన్నెల, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది. ఎనిమిది రోజుల క్రితం హత్య జరిగినట్టు తెలుస్తోంది. భర్తను చంపి నిర్మాణంలో ఉన్న ఇంట్లోనే పాతి పెట్టారు. పోలీసుల విచారణలో భార్య, ప్రియుడు హత్య చేసినట్టు అంగీకరించారు. మృతదేహాన్ని వెలికి తీసేందుకు ఆ ఇంట్లో పోలీసులు తవ్వకాలు జరుపుతున్నారు. నిందితులిద్దరు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.



