తాండూరు ప్రజలకు అప్రమత్త సూచిక
– వర్షాలనుంచి జాగ్రత్తగా ఉండండి
– ఇండ్ల నుంచి బయటకు రావద్దు
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అప్రమత్త సూచన చేశారు. ఆదివారం ఆమె ఓ ప్రకటనలో మాట్లాడుతూ మరో 3 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారుల సూచన మేరకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాల కారణంగా ప్రభుత్వం పాఠశాలలకు సోమ, మంగళ, బుధవారాలు సెలవులు ప్రకటించిందని గుర్తుచేశారు. కాబట్టి ప్రజలు ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావడం, పిల్లలను బయటకు తీసుకురావడం చేయవద్దన్నారు. అదేవిధంగా పట్టణం చుట్టుపక్కల ఉన్న చెరువులు, కుంటల వద్దకు వెళ్లొద్దన్నారు. ముఖ్యంగా శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండడం ప్రమాదకరమని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. అంతేకాకుండా విద్యుత్ పరికరాలు, ట్రాస్పర్మర్లు, కరెంటు స్తంభాలు, కరెంటు తీగలు ఉండే ప్రదేశాలలో జాగ్రత్తగా ఉండాలన్నారు. దీనిపై మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల కౌన్సిలర్లు పార్టీలకు అతీతంగా ప్రజలను అప్రమత్తం చేయడంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.



