శాకాంబరీ నమోస్తుతే..!
– కూరగాయలు, పండ్లతో అమ్మవార్ల ముస్తాబు
– తాండూరు దేవాలయాల్లో ఆషాడ శోభ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని పలు దేవాలయాల్లో ఆషాఢ మాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని శాకాంబరీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

నెహ్రూ గంజ్లోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం, మర్రిచెట్టు కూడలిలో వెలసిన రక్తమైసమ్మ ఆలయం, వాల్మీకి నగర్లోని రేణుకా ఎల్లమ్మ దేవాలయాల్లో అమ్మవారిని కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు.

ఉత్సవాల సందర్భంగా మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నెహ్రూ గంజ్ ఎల్లమ్మ ఆలయంలో మహిళలు భక్తిశ్రద్ధలతో సహస్రనామ పారాయణం నిర్వహించారు. అనంతరం ఆలయాలకు విచ్చేసిన భక్తులకు ఆలయ పూజారి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందించారు.

శాకాంబరీ అలంకరణలతో దేవాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా, భక్తుల రద్దీతో తాండూరులో ఆషాఢ మాసం చివరి శుక్రవారం పండుగ వాతావరణం నెలకొంది.


