కల్లోలం..!
– కుప్పకూలిన కల్లు బాధితులు
– ముకుందాపూర్లో ఘటన
– జిల్లా ఆసుపత్రిలో చేరిక
తాండూరు, దర్శిని ప్రతినిధి: కల్లు.. వల్ల వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో కల్లొలం రేగింది. కల్లు సేవించే బాధితులు అకస్మాత్తుగా కుప్ప కూలిపడిపోవడం.. మూర్ఛ్య వచ్చినట్లు ప్రవర్తించడంతో ఆందోళన చోటు చేసుకుంది. శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కల్లు సేవించే బాధితులు సాయంత్రం నుంచి ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయారు. అనంతరం మూర్ఛ్య వచ్చినట్లు కొట్టుకున్నారు. దాదాపు గ్రామానికి చెందిన 20 మంది వరకు ఇలాగే ప్రవర్తించారు. ఆందోళన చెందిన పలువురు కుటుంబ సభ్యులు తాండూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. గ్రామానికి చెందిన నలుగురు బాధితులు ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి పర్యవేక్షణలో ఉంచారు. మరోవైపు విషయం తెలుసుకున్న తాండూరు ఎక్సైజ్ సీఐ చంద్రకాంత్ రెడ్డి ఆసుపత్రికి చేరుకున్నారు.

బాధితులతో మాట్లాడి వివరాలను ఆరా తీశారు. అనంతరం కల్లుకు సంబంధించి నమూనాలను సేకరించినట్లు ఎక్సైజ్ సీఐ తెలిపారు. ఇదిలా ఉండగా కల్లు సేవించే అలవాటు ఉన్నవారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సేవించడం మానేశారని, ఇలా జరగడంతో బాధితులు కూలిపోవడం, మూర్ఛ్యతో ప్రవర్తిస్తున్నారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి జరిగిన ఈసంఘటన గ్రామంలో కల్లోలం రేపింది.

