జారుతారు.. జాగ్రత్త..!
– డేంజర్గా మారిన సీసీ రోడ్డు
– సాయిపూర్ వెళ్లాలంటే భయం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని సాయిపూర్ రోడ్డు డేంజర్గా మారింది. రోడ్డుపై పేరుకుపోయిన మట్టితో జారిపడే విధంగా తయారైంది. పట్టణంలోని బీసీ స్మశాన వాటిక నుంచి సాయిపూర్ వెళ్లే మార్గంలో ఇటీవలే సీసీ రోడ్డు పనులు చేపట్టారు. ఈ క్రమంలో రోడ్డును క్యూరింగ్ చేసేందుకు రోడ్డుపై మట్టి పోశారు. పని ముగిసిన తరువాత వాటిని తొలగించలేదు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో రోడ్డుపై ఉన్న మట్టి రోడ్డంతా పరుచుకుంది. బుధవారం ఉదయం వివిధ పనుల కోసం రాకపోకలు సాగించిన వాహనదారులు, పాదాచారులు మట్టితో ఇబ్బందులు పడ్డారు. వాహనాలు, ప్రజలు మట్టి వల్ల జారిపడేలా పరిస్థితి తయారైంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఈ మార్గంలోనే ఉన్నాయి.
ఉదయం వేళ ఈ మార్గంలో వెళ్లేందుకు విద్యార్థులు, ఆటో డ్రైవర్లు బెంబేలెత్తిపోయారు. అధికారులు, పాలకులు చేసిన నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే రోడ్డుపై ఉన్న మట్టి కుప్పలను తొలగించి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. వీడియో కూడా ఉంది చూడండి..
ఇది కూడా చదవండి…


