రూ. 60లకే కిలో శనగ పప్పు..!
– భారత్ దాల్ పేరుతో విక్రయాలు
– హాకాకు బాధ్యతలు అప్పగించిన కేంద్రం
– రేపటి నుంచి అమ్మకాలు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : దేశంలోని సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రూ. 60 లకే కిలో శనగ పప్పును అందించాలని కేంద్రంం నిర్ణయించింది. రేపటి నుంచి తెలంగాణలో అమ్మకాలను ప్రారంభించబోతోంది. ఈ బాధ్యతను హైదరాబాద్ వ్యవసాయ సహకార సంఘం(హాకా)కు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు రేపు అక్టోబరు 1న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్కుమార్ సింగ్, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, హాకా ఛైర్మన్ ఎం.శ్రీనివాస్రావులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. శనగ నిల్వలు పేరుకుపోయిన నేపథ్యంలో ‘భారత్ దాల్’ పేరిట వచ్చేనెల 1న హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
దీనిద్వారా 50 వేల టన్నుల శనగపప్పును హాకా రాష్ట్రంలో విక్రయించనుంది. శనగ నిల్వలు భారీగా ఉండడంతో మొదటిదశలో వాటిలో 20 శాతం సబ్సిడీపై విక్రయించేందుకు వీలుగా కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టింది. దీనికోసం దేశవ్యాప్తంగా ప్రభుత్వ మార్కెటింగ్ సంస్థలను పరిశీలించింది. తెలంగాణలో హాకాకు ఈ అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. 18 రాష్ట్రాల్లో 5000 సంచార వాహనాల ద్వారా విక్రయాలు చేపట్టనుండగా.. తెలంగాణలో 200 ఆటోల ద్వారా విక్రయించనున్నారు.
ఈ పథకం కింద శనగపప్పు కిలో విడిగా రూ.60కి విక్రయిస్తారు. 30 కిలోల బస్తా తీసుకుంటే కిలో రూ.55 ధరకే లభిస్తుంది. వినియోగదారులతో పాటు దేవాలయాలు, ధార్మిక సంస్థలు, జైళ్లు, పోలీసు శాఖలకు విక్రయించేందుకు కేంద్రం అనుమతించింది. దీంతోపాటు ప్రభుత్వేతర సంస్థలు, చిల్లర, టోకు వ్యాపారులు, షాపింగ్ మాల్స్, ఇ-కామర్స్ సంస్థలు, ఆసుపత్రులు, సామూహిక వంటశాలలు, ప్రాథమిక సహకార సంఘాలకు సైతం 30 కేజీల సంచులను విక్రయించనున్నారు.
ఇదికూడా చదవండి…

