మైనార్టీ విద్యార్థులకు అలెర్ట్..!
– గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
– ఎంపిక ఎలా చేస్తారంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులకు ప్రభుత్వం అలెర్ట్ ప్రకటన చేసింది. 2024-25 విద్యాసంవత్సరానికి మైనార్టీ గురుకులాల్లో 5, 6, 7, 8 తరగతులు, ఇంటర్ మొదటి ఏడాదిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, సీవోఈ (సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్) కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మైనారిటీ గురుకుల పాఠశాలల్లో అయిదో తరగతి ప్రవేశాలతోపాటు మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ సీట్లలో అడ్మిషన్లు, మైనారిటీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో జనరల్, ఒకేషనల్, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
తరగతిని బట్టి వాటికి ముందున్న 4, 5, 6, 7, 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్ధుల తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షలకు మించకుండా ఉండాలి.
చివరి తేది ఎప్పటి వరకు అంటే..?
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: జనవరి 17, 2024.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: ఫిబ్రవరి 6, 2024.
అభ్యర్థుల ఎంపిక, ధ్రువపత్రాల పరిశీలన తేదీలు: ఏప్రిల్ 24, నుంచి 30 వరకు 2024 (5వ నుంచి ఎనిమిదో తరగతులకు)
ఇంటర్మీడియట్కు అభ్యర్థుల ఎంపిక, ధ్రువపత్రాల పరిశీలన తేదీలు: మే 1 నుంచి మే 10 వరకు.
ప్రవేశ పరీక్ష తేదీ (సీవోఈ): ఫిబ్రవరి 25, 2024.
ఇలా ఎంపిక చేస్తారు
5వ తరగతిలో ప్రవేశాలకు.. ముందుగా దరఖాస్తు చేసుకున్న మైనారిటీలకు సీట్లు కేటాయిస్తారు. ఇతరులకు లక్కీ డ్రా ద్వారా సీట్లు కేటాయిస్తారు. ఇక 6, 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను మొదట దరఖాస్తు చేసుకున్న వారికి సీట్లు కేటాయిస్తారు. పదో తరగతిలో మెరిట్ ఆధారంగా ఇంటర్ ఫస్టియర్ జనరల్, ఒకేషనల్ కోర్సులకు సీట్లు కేటాయిస్తారు. ఇంటర్ ‘సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్’లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సీట్లు కేటాయిస్తారు. ఏవైనా సందేహాలుంటే 040 23437909కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. లేదంటే ఆయా జిల్లాల్లోని మైనారిటీ సంక్షేమ అధికారులను, గురుకులాల ప్రిన్సిపాళ్లను సంప్రదించి తెలుసుకోవచ్చు.
ఇదికూడా చదవండి…

