డబ్బు, మద్యం సరిహద్దులు దాటొద్దు..!
– కట్టుదిట్టంగా పార్లమెంట్ ఎన్నికలు పూర్తి చేయాలి
– పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజీవ్ చోప్రా
– తాండూరులో అంతర్ రాష్ట్ర చెక్ పోస్టుల సందర్శన
తాండూరు, దర్శిని ప్రతినిధి : డబ్బు, మద్యం అక్రమంగా సరిహద్దులు దాటకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజీవ్ చోప్రా(ఐఆర్ఎస్) అన్నారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తాండూరు నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసిన అంతర్ రాష్ట్ర చెక్’ పోస్టులను గురువారం ఆయన సందర్శించారు.
తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు, డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, పోలీసు, రెవెన్యూ సిబ్బందితో కలిసి తాండూరు మండలం కొత్లాపూర్ చెక్ పోస్టు. యాలాల మండలం లక్ష్మీనారాయణ పూర్ చౌరస్తాలోని చెక్ పోస్టులను తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించి.. ఎస్ఎస్టి బృందాలకు చెక్ పోస్టుల వద్ద చేపట్టాల్సిన విధులపై ఆదేశాలు జారీ చేశారు. అక్రమంగా మద్యం, డబ్బు, సంఘ విద్రోహ శక్తుల సంచారం లేకుండా చూడాలని, అలాంటివి ఏమైనా సరిహద్దు దాటకుండా దృష్టిసారించాలన్నారు.

దీంతో పాటు ఏఈఓ, వ్యయం బృందాలు, వీవిటీ బృందాలతో ఎన్నికల విధులపై అవగాహన కల్పించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి ఆశ్రద్ధ వహించరాదని, కట్టుదిట్టమైన చర్యలతో ఎన్నికలను పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తారాసింగ్, తాండూరు రూరల్ సీఐ అశోక్, కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి, ఎన్నికల సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

