మహిళ కడుపులో 8 కిలోల గడ్డ..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

మహిళ కడుపులో 8 కిలోల గడ్డ..!
– శస్త్రచికిత్స ద్వారా తొలగింపు
– సాయితరుణ్‌ ఆసుపత్రిలో రిస్క్ ఆపరేషన్
– వైద్య సేవలు అందించిన డా.జయప్రసాద్‌
తాండూరు, దర్శిని ప్రతినిధి : మహిళ కడుపులో పెరుగుతున్న దాదాపు 8 కిలోల గడ్డను శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ఈ ఆపరేషన్ వికారాబాద్‌ జిల్లా తాండూరులోని సాయితరుణ్ ఆసుపత్రిలో జరిగింది. ఆసుపత్రికి చెందిన ప్రముఖ వైద్యులు డా.జయప్రసాద్ మహిళకు ఆపరేషన్ చేసి వైద్య సేవలు అందించారు. వివరాలలోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం సేడం తాలూకా గురుకుంట సమీపంలోని మదికల్ గ్రామానికి చెందిన వడ్డె లక్ష్మీ భర్త నర్సింలుతో కలిసి గనులలో కూలి పనులు చేసేది. వీరికి నలుగురు ఆడ కూతుళ్లు ఉన్నారు.

గత పదేండ్ల క్రితం భర్త నర్సింలు కన్నుమూశారు. గత యేడాది క్రితం నుంచి లక్ష్మీ కడుపు నొప్పితో బాధపడుతోంది. కర్ణాటకలోని సేడం తదితర ఆసుపత్రిలలో చూపించుకున్నా కడుపునొప్పి తగ్గలేదు. ఆమె అవస్థను తెలుసుకున్న రెండో కూతురు విజయలక్ష్మీ భర్త, అల్లుడు రవి నెల రోజుల క్రితం తాండూరులోని డా.జయప్రసాద్ ఆసుపత్రిలో సంప్రదించారు. దీంతో డా.జయప్రసాద్ లక్ష్మీని పరిశీలించి పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల ద్వారా లక్ష్మీ కడుపులో గడ్డ పెరుగుతున్నట్లు గుర్తించారు. శనివారం డా.జయప్రసాద్ నేతృత్వంలో లక్ష్మీకి ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు.

ఈ ఆపరేషన్ ద్వారా ఆమె కడుపులో నుంచి సుమారు 8 కిలోల బరువు ఉన్న గడ్డను తొలగించారు. డా.జయప్రసాద్ ఆధ్వర్యంలో ఆపరేషన్ విజయవంతం అయ్యింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కడుపులో నుంచి తొలగించిన గడ్డను పరీక్షలకు పంపిస్తామని, వాతావరణం, నీటి కలుషితం వల్ల ఇలాంటి పరిస్థితులు రావచ్చని డా.జయప్రసాద్ వెల్లడించారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీ తనకు అందిన వైద్యం ప్రాణదానంతో సమానమని, ఇందుకు డా.జయప్రసాద్‌కు ధన్యవాదలు తెలిపింది.

ఇదికూడా చదవండి…

రేపే ప్రెస్ అండ్ పోలీసు ఫ్రెండ్లీ మ్యాచ్..!