బడుల దుస్థితిపై కాస్త దృష్టి పెట్టండి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బడుల దుస్థితిపై కాస్త దృష్టి పెట్టండి..!
– సమస్యలతో విద్యార్థుల సతమతం
– భవిష్యత్తుతో చెలగాటం చాలు
– బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ ఆగ్రహం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ప్రభుత్వ బడుల దుస్థితిపై కాస్త దృష్టి సారించాలని 8వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ అన్నారు. రాజు కాలనీ, ఇంద్రమ్మ కాలనీల మండల ప్రాథమిక పాఠశాలలను సోమవారం సందర్శించి సమస్యలను పరిశీలించారు.

అనంతరం మాట్లాడుతూ ప్రహరీ గోడలు దెబ్బతినడంతో పాఠశాలల్లోకి అసాంఘిక శక్తులు ప్రవేశించే పరిస్థితి నెలకొందని, పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదన్నారు. రెండు పాఠశాలల్లో రెండేసి గదుల్లోనే ఐదు తరగతుల విద్యార్థులకు ఉర్దూ, ఇంగ్లీష్ మీడియం బోధన జరుగుతోందని, ఒకే గదిలో పలువురు తరగతుల విద్యార్థులు ఉండటంతో బోధన ప్రభావితమవుతోందన్నారు.

శాశ్వతంగా ఒక్కో ఉపాధ్యాయుడు మాత్రమే ఉండగా, మిగిలిన వారు డెప్యుటేషన్‌పై కొనసాగుతున్నారని తెలిపారు. పాఠశాలలను 8వ తరగతి వరకు విస్తరించి, ఏడుగురు శాశ్వత ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు.

సమస్యలను పరిష్కరించకుండా రాజకీయ కౌంటర్లకే పరిమితం కావడం సరికాదన్నారు. తాండూరులోని అన్ని వార్డులు, గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరిస్తే అధికారులను, ప్రజాప్రతినిధులను సన్మానిస్తానని, లేకుంటే పైలట్ రోహిత్ రెడ్డితో కలిసి అన్ని వార్డుల్లో పర్యటించి ప్రజా సమస్యలపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జావిద్ హెచ్చరించారు.

ప్రజా సేవకుడు మనోహరన్న..!