ఎస్ఐఆర్ రెండో దశను అప్రమత్తంగా పూర్తి చేయాలి
– ఓటరు జాబితాలో ఓటు తొలగకుండా శ్రద్ద చూపాలి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– బీఎల్ఏలకు, నేతలకు అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎస్ఐఆర్ రెండో దశలో అర్హులైన ఓటర్లు తొలగిపోకుండా బీఎల్ఏలు పనిచేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

మంగళవారం తాండూరు పట్టణంలోని శ్రీ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏ)లకు ఎస్ఐఆర్ రెండో దశపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరైన ఓటర్ల జాబితా సవరణలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉండేలా చూడటం బీఎల్ఏల బాధ్యత అని అన్నారు. ముఖ్యంగా అర్హత ఉన్న ఓట్లు తొలగిపోకుండా ప్రతి బూత్ పరిధిలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు.

తాండూరు నియోజకవర్గంలో దాదాపు 50 వేల మంది ఓటర్లకు నోటీసులు అందినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ తమ వివరణ అందించేలా బీఎల్ఏలు సమాచారం చేరవేయాలని చెప్పారు. నోటీసులపై ఏవైనా సందేహాలు ఉంటే పార్టీ నాయకులను సంప్రదించి అవసరమైన సహకారం పొందాలని సూచించారు. ఓటర్ల జాబితా విషయంలో అప్రమత్తంగా ఉండాలని, బూత్ల వారీగా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పరిష్కరించే దిశగా పార్టీ శ్రేణులు పనిచేయాలని అన్నారు.

మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చొరవ చూపాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ధారాసింగ్, మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి, ఎస్ఐఆర్ తాండూరు కన్వీనర్ పురుషోత్తంరావు, పార్లమెంట్ ఇన్చార్జి జగదీశ్వర్, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, ఏఎంసీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, ఎస్ఐఆర్ కొడంగల్ కోఆర్డినేటర్ మల్లేశ్ యాదవ్, పట్టణ, మండల అధ్యక్షులు, సర్పంచులు, కౌన్సిలర్లు, బీఎల్ఏలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


