కాలేజీలో కామాంధుడు..!
– మైనర్ బాలికతో మాయమాటలు
– తాండూరులో ఆలస్య ఘటన కలకలం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మైనర్ విద్యార్థినిని ఓ అధ్యాపకుడు మాయమాటలతో లోబర్చుకున్నాడనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

విద్యార్థిని ప్రవర్తనలో మార్పు రావడంతో తల్లిదండ్రులు ఆమెను మందలించగా.. దీంతో అసలు విషయం బయటకు వచ్చినట్లు సమాచారం. అనంతరం బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో అధ్యాపకుడి వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహంతో సదరు అధ్యాపకుడిని నిలదీసి దేహశుద్ధి చేసినట్లు సమాచారం.

అయితే ఈ ఘటన జరిగి సుమారు నెల రోజులు గడిచిన తర్వాత తాజాగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే విద్యార్థిని ఇంటర్ విద్యను పూర్తి చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆమె తదుపరి చదువులకు తీవ్ర ఆటంకం ఏర్పడే పరిస్థితి నెలకొంది.

మరోవైపు సదరు అధ్యాపకుడికి రాజకీయ అండదండలు ఉన్నాయని, ఈ వ్యవహారాన్ని డబ్బులు ఇచ్చి సద్దుమణిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో ఇప్పటివరకు కేసు నమోదు కాలేదని తెలుస్తోంది.

కాలేజీలో కామాంధుడుపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఘటనపై పోలీసుల విచారణతోనే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పలువురు చర్చించుకుంటున్నారు.


