వినాయకుల సేవలో.. శంకర్ యాదవ్ !
– ఉత్సవ కమిటీలకు ఉచితంగా ‘క్రేన్’ సాయం
– విగ్రహాల తరలింపులో సేవా బాట
– పర్యవేక్షించిన శంకర్ యాదవ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : గణేష్ ఉత్సవ కమిటీలకు అండగా నిలుస్తూ శ్రీ సాయిపుత్ర సేవా సమితి అధినేత భానొల్ల శంకర్ యాదవ్ ఉచిత క్రేన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.

వినాయక విగ్రహాలను సురక్షితంగా వాహనాల్లోకి ఎక్కించేందుకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆదివారం తాండూరు పట్టణ శివారులోని వినాయక విగ్రహాల తయారీ కేంద్రాల వద్ద శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత క్రేన్ సేవలను పర్యవేక్షించారు. వివిధ గణేష్ ఉత్సవ సమితుల వాహనాల్లో భారీ విగ్రహాలను జాగ్రత్తగా ఎక్కించేలా సిబ్బందికి సూచనలు చేశారు.

విగ్రహాల తరలింపు సమయంలో నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలను నిరంతరం అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు నిర్వాహకులపై అదనపు ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతోనే క్రేన్ సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు శంకర్ యాదవ్ తెలిపారు. సేవా కార్యక్రమాలు కేవలం ఒక రోజుకే పరిమితం కాకుండా.. నిమజ్జనం రోజుకూడా నిరంతరం కొనసాగించాలన్నదే తమ లక్ష్యమన్నారు. శంకర్ యాదవ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు.

గణేష్ ఉత్సవాల సమయంలో విగ్రహాల తరలింపులో ఎదురయ్యే సమస్యను గుర్తించి ఉచిత క్రేన్ సౌకర్యం కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ కన్వీనర్ కందుకూరి రాజ్కుమార్, పీఆర్టీయూ తాండూరు మండల అధ్యక్షుడు జోనాల వినోద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బంటు మల్లప్ప, క్రేన్ సేవలను పర్యవేక్షిస్తున్న చంగోల్ కిరణ్, మల్రెడ్డి, శంకర్ యాదవ్ స్నేహబృందం సభ్యులు ప్రేమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.


