జపాన్ విద్యా విధానం భేష్..!
– ఆ విధానాల అమలుతో ఉత్తమ భవిష్యత్తు ఖాయం
– తెలంగాణలో శ్రీకార నిర్ణయం అభినందనీయం
– ఎక్స్పోజర్ విజిట్ అవకాశం.. సీఎంకు కృతజ్ఞతలు
– యాలాల మండల ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : అంతర్జాతీయ స్థాయి విద్యా విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా పాఠశాల విద్యలో మరిన్ని నూతన మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం లభించిందని జపాన్ టీచర్ ఎక్స్పోజర్ విజిట్లో పాల్గొన్న ఎస్ఏ సి. కృష్ణారెడ్డి తెలిపారు. యాలాల మండలం కోకట్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి జపాన్ పర్యటనకు ఎంపికైన సంగతి తెలిసిందే.

ఈ మేరకు పాల్గోన్న జపాన్లోని పాఠశాలల్లో విద్యార్థుల క్రమశిక్షణ, సమయపాలన, పరిశుభ్రత, బాధ్యతాయుత ప్రవర్తన ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయని కృష్ణారెడ్డి పేర్కొన్నారు. చిన్న వయసు నుంచే విద్యార్థుల్లో స్వీయ నిర్వహణ, సహకార భావన, స్వయం ఆధారితతను పెంపొందించే విధానం ఎంతో ఆదర్శంగా ఉందన్నారు. విద్యార్థుల అభ్యాసంలో ఉపాధ్యాయులు చూపుతున్న అంకితభావం స్ఫూర్తిదాయకమని తెలిపారు.

అక్కడి పాఠశాలల్లో సాంకేతికతను బోధనలో సమర్థంగా వినియోగించడంతో పాటు.. ప్రాక్టికల్ లెర్నింగ్, నైపుణ్యాభివృద్ధి, విద్యార్థి కేంద్రిత బోధనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. విద్యార్థులను కేవలం పాఠ్యాంశాలకే పరిమితం చేయకుండా.. రోజువారీ జీవితానికి అవసరమైన బాధ్యతలు, నైపుణ్యాలను నేర్పుతున్న విధానం ప్రత్యేకంగా నిలిచిందన్నారు. అక్కడి ఉత్తమ విధానాలను మన పరిస్థితులకు అనుగుణంగా ఆచరణలోకి తీసుకురాగలిగితే విద్యార్థులకు మరింత మెరుగైన భవిష్యత్తును అందించవచ్చు అని కృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ పర్యటన తన బోధనా దృక్పథాన్ని మరింత విస్తృతం చేసిందని, నేర్చుకున్న అంశాలను విద్యార్థులకు ఉపయోగపడేలా అమలు చేయడమే తన లక్ష్యమని తెలిపారు.

ఈ అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఐఏఎస్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డా. నవీన్ నికోలస్ ఐఏఎస్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో అవసరమైన సహకారం, ప్రోత్సాహం అందించిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ ఐఏఎస్, జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని, ఏఎంఓ రామ్ మస్తా, జైస్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆయన తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులకు కల్పించిన ఈ అంతర్జాతీయ పర్యటన ఎంతో విలువైన అనుభవాన్ని అందించిందన్నారు. తెలంగాణకు చెందిన 40 మంది ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో టీచర్స్ ఎక్స్పోజర్ విజిట్ టు జపాన్ విజయవంతంగా ముగిసిందని తెలిపారు.


