విత్తన గణేషుడు శుభకరం..!
– పూజకు శ్రేష్టం, ప్రకృతికి మేలు
– గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా పంపిణీ
– వితరణ చేసిన కోట్రిక విజయలక్ష్మి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక చవితి వేడుకలకు పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని జోడిస్తూ తాండూరులో విత్తన గణపతుల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

మాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్కుమార్ ఆశయంతో రూపొందించిన విత్తన గణపతులను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వికారాబాద్ జిల్లా కో ఆర్డినేటర్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి పంపిణీ చేశారు.

ఆర్డీఓ అనిత, మున్సిపల్ కమిషనర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి విత్తన గణపతులను అందజేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో విత్తన గణపతులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

విత్తన గణపతిని పూజించిన అనంతరం నేలలో నాటితే అందులోని విత్తనం మొలకెత్తి మొక్కగా ఎదుగుతుందని వివరించారు. ‘వినాయకుడిని పూజించి.. గణపతినే మొక్కగా పెంచి.. పచ్చదనాన్ని పెంచుదాం’ అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు.

పర్యావరణహితంగా వినాయక చవితిని నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పరిమళ పాల్గొన్నారు.


