దస్తగిరిపేట్కు ముక్కోటి శోభ..!
– ఉదయం నుంచే ఉత్తర ద్వార దర్శనం
– భారీగా తరలివచ్చి దర్శించుకుంటున్న భక్తులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలం అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట్ (చంద్రగిరిపట్నం)కు ముక్కోటి శోభ సంతరించుకుంది. గురువారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా గ్రామంలో వెలసిన శ్రీ శ్రీదేవి భూదేవి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శన భాగ్యం కల్పించారు.
తెల్లవారు జాము నుంచే ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమయ్యింది. అంతకుముందు ఆలయ అర్చకులు ఆలయంలో వెలసిన సతీ సమేత శ్రీ దేవి భూదేవి శ్రీ వేంకటేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామి వార్లకు ప్రత్యేక అలంకరణలకు చేసి భక్తులకు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శన భాగ్యం కల్పించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు ఆలయానికి భారీ ఎత్తున పోటెత్తారు.
భక్తుల రాకతో ఆలయం కిక్కిరిసి పోయింది. భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శించుకున్నారు. మరోవైపు భక్తులతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ డైరెక్టర్, ఎల్మకన్నె సహాకార సంఘం చైర్మన్ ఎస్. రవీందర్ గౌడ్, తాండూరు ఎంపీపీ అనితా రవీందర్ గౌడ్, పెద్దేముల్ ఎంపీపీ అనురాధ రమేష్, ఎంపీడీఓ సుదర్శన్ రెడ్డి, తాండూరుకు చెందిన పుర ప్రముఖులు, వ్యాపారులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.


