కారు కన్నా.. కమలమే స్ట్రాంగ్..!
– సర్వేలో బీజేపీకే బలం ఎక్కువ
– అందులో చేరితే 30 మంది నావెంట వస్తారు
– సంచలన వాఖ్యలు చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి
దర్శిని డెస్క్: తాండూరు అసెంబ్లీ రాజకీయాలపై చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశర్ రెడ్డి సంచలన వాఖ్యలు చేశారు. తాండూరులో కారు కన్న కమలమే స్ట్రాంగా ఉందని, తన సర్వేలో స్పష్టంగా తేలిందని బాంబు పేల్చారు. రెండు మూడు రోజులుగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే స్పందించిన ఆయన.. ఓ మీడియాతో మాట్లాడారు. ఏ పార్టీలో చేరుతారనే విషయంపై దాదాపు క్లారిటీ ఇచ్చారు.
టీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీజేపీ ఫైట్ చేస్తుందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. లీడర్లు, క్యాడర్ ఉన్న కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఏమాత్రం నమ్మకం లేదన్నారు. తాండూరు నియోజకవర్గంలో తాను నిర్వహించిన సర్వేల్లో కూడా ఇదే తేలిందని చెప్పుకొచ్చారు కొండా, కాంగ్రెస్ కన్నా బీజిపీ వ్యూహాలు ధీటుగా ఉన్నాయన్నారు. బీజేపీలో చేరడానికి కొన్ని అంశాలపై క్లారిటీ అడిగానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. వచ్చే నెలలో తాను ఏ రాజకీయ పార్టీలో చేరాలనే దానిపై నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. జాతీయ పార్టీలు కేసీఆర్ గెలిచినా తమకు ఉపయోగపడాలని అనుకుంటాయని పేర్కొన్నారు. అంతేకాదు.. మరో బాంబ్ కూడా పేల్చారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. టీఆర్ఎస్పై బీజేపీ రెండు అడుగులు ముందుకు వేసి పుంజుకుంటే 30 మంది కీలక నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. వారెవరో త్వరలోనే తెలుస్తుందని సస్పెన్స్లో పెట్టారు.

