క్రమబద్దీకరణ అర్హులకు పట్టాలు..!
– వచ్చేనెలలో పంపిణీకి నిర్ణయం
– జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ప్రభుత్వ భూముల్లో ఆవాసాలు ఏర్పరుచుకుని జీవిస్తున్న వారికి జీఓ 58 కింద క్రమబద్దీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఇందుకు దరఖాస్తు చేసుకున్న నిరుపేదలకు పట్టాలు పంపిణీ చేసేందుకు తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మండలానికో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అర్హులను గుర్తించున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన క్రమబద్దీకరణ జీఓ 58 కింద 125 చదరపు గజాల లోపు అక్రమించుకుని ఇండ్లు నిర్మించుకున్న వారిని గుర్తించి పట్టాలను అందజేయనుంది. ప్రత్యేక బృందాల ద్వారా అర్హులను గుర్తించిన వెంటనే ఆర్డీఓలు పరిశీలించి జిల్లా కలెక్టర్లకు నివేధికలను అందజేస్తారు. అర్హుల గుర్తింపును వేగవంతం చేయాలని కూడ ప్రభుత్వం ఆదేశించింది. వచ్చేనెల రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా క్రమబద్దీకరణ అర్హులకు పట్టాలను అందించాలని నిర్ణయించింది.

