శభాష్ జొళ్లు రోహిణి..!
– వీరశైవ సమాజం ఎన్నికల పోటీ కోసం నిరసన
– తాండూరు కార్యాలయం వద్ద బైటాయింపు
– పెద్దల నుంచి హామి సాధించుకుని దీక్ష విరమణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన వీరశైవ సమాజంకు చెందిన మహిళను శభాష్ అంటూ పట్టణ వాసులు అభినందించారు. ఎన్నికలలో పోటీ కోసం మహిళల తరుపున నిరసకు దిగింది. పెద్దల హామిని సాధించుకుని దీక్షను విరమించింది. వివరాల్లోకి వెళితే.. తాండూరులోని వీరశైవ సమాజంలో ఇటీవల నూతన కార్యవర్గం ఎన్నికకు నగారా మోగింది. ప్రస్తుత సమాజం కార్యవర్గ సభ్యులు, గతంలో ఓటమి పాలైన సభ్యులు, స్వతంత్ర అభ్యర్థులు పోటీలకు మరోసారి సిద్ధమయ్యారు. అయితే.. అదే సమాజానికి చెందిన జొళ్లు రోహిణి అనే మహిళ సమాజం ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ ను తెరమీదకు తెచ్చారు. శుక్రవారం భద్రేశ్వర దేవాలయం ఆవరణలో ఉన్న వీరశైవ సమాజం వద్ద నిరసన చేపట్టారు. సమాజం ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలను అందించాలని కోరారు.
సమాజంలో అలాంటి నిబంధనలు లేకపోవడంతో ఎన్నికల నిర్వహకులు ఎలాంటి స్పందన తెలుపలేదు. దీంతో జొళ్లు రోహిణి సమాజం కార్యాలయ వద్ద నిరసన ప్రారంభించారు. మహిళలకు సమాజంలో హక్కు కల్పించాలని, నామినేషన్ పత్రాలను అందించాలని డిమాండ్ చేస్తూ నిరసనను కొనసాగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 5 గంటల పాటు ఆమె నిరసన కొనసాగించారు. చివరకు సమాజం పెద్దలు స్పందించి వచ్చే నూతన కార్యవర్గంలో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తామని.. పక్కా హామీ ఇవ్వడంతో రోహిణి తన నిరసన దీక్షను విరమించుకున్నారు. ఈ సంఘటన తాండూరు వీరశైవ సమాజంతో పాటు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. మహిళల హక్కుల పట్ల చైతన్యంగా ఉండాలని ప్రదర్శించిన తీరుపై శభాష్ జొళ్లు రోహిణి అంటూ అభినందనలు తెలిపారు.
ఇది కూడా చదవండి…
వేపాకుతో రోగాల దిగులు దూరం
– ఆకులో అద్భుతమైన ఔషధ గుణాలు
– తెలుసుకుని పాటిస్తే మేలు
https://dharshininews.com/17186


