మట్టి వినాయకులనే పూజిద్దాం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మట్టి వినాయకులనే పూజిద్దాం..!
– ప్రకృతికి రక్షణ.. కులవృత్తులకు ప్రోత్సాహం
– పీఓపీ విగ్రహాలకు దూరంగా ఉండాలి
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్ 
తాండూరు, దర్శిని ప్రతినిధి: వినాయక చవితి వేడుకల్లో మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించి పూజించాలని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్‌ కందుకూరి రాజ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సంప్రదాయ కులవృత్తులకు అండగా నిలిచేందుకు మట్టి గణపతుల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

వినాయక చవితిని పురస్కరించుకుని ఆదివారం బీసీ సంఘం ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని విషాల్‌ మార్ట్‌ వద్ద మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కందుకూరి రాజ్‌కుమార్‌ పాల్గొని భక్తులకు మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే పీఓపీ విగ్రహాలకు బదులుగా సహజసిద్ధమైన మట్టితో తయారు చేసిన వినాయకులను పూజించాలని సూచించారు.

మట్టి వినాయకులను పూజించడం ద్వారా పండుగ సంప్రదాయాన్ని కొనసాగించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించినట్లవుతుందని రాజ్‌కుమార్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా మట్టి విగ్రహాల తయారీపై ఆధారపడి జీవించే సంప్రదాయ వృత్తిదారులకు ఉపాధి, ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. భక్తి, పర్యావరణ బాధ్యత రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వినాయక చవితిని జరుపుకోవాలని కోరారు.

అదే కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్‌. కృష్ణయ్య 73వ జన్మదిన వేడుకలను బీసీ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బీసీల హక్కులు, సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషిని నాయకులు కొనియాడారు.

కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్‌ శుకూర్‌, జిల్లా నాయకులు గడ్డం వెంకటేశ్‌, మహిళా ప్రతినిధులు మంజుల, నర్సమ్మ, విజయలక్ష్మి, జగదీశ్వరి, జ్యోతి, రజక సంఘం జిల్లా నాయకులు కృష్ణ, బీసీ నాయకులు బాలాజీ ఠాకూర్‌, టైలర్‌ రమేశ్‌, బాబాగౌడ్‌, గిరిజాపూర్‌ రమేశ్‌, నర అశోక్‌, మంతటి రాజు, రాము ముదిరాజ్‌, శ్రీనివాస్‌, పరమేశ్‌, జోసెఫ్‌, హరిప్రసాద్‌, రామ్‌రెడ్డి, వడ్ల సంగమేష్‌, శ్రీశైలం గౌడ్‌, రాహుల్‌, రాజు, కిరణ్‌, వినయ్‌, అంతరం చిన్నా, సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌ బసవరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

కంపు కదలదేమి..? మురుగుతో నరకం..!