ముసుగంతా నిర్లక్ష్యం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ముసుగంతా నిర్లక్ష్యం..!
– కోడ్ ముగిసినా విగ్రహాలకు తొలగని మోక్షం
– అధికారులపై వెలువెత్తుతున్న విమర్శలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికారయంత్రాంగం నిర్లక్ష్యానికి సాక్షమిది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసినా తాండూరులో రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు తొలగిపోలేదు. అధికారుల నిర్లక్ష్యం పాత్రపై స్థానిక నేతలు, ప్రజల నుంచి విమర్శలు వెలువెత్తున్నాయి. హైదరాబాద్, ఉమ్మడి రంగా రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గతనెల 9వ తేది నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈనెల 13న ఎన్నికలు, 17న ఎన్నికల ఫలితాల విడుదల తరువాత ఎన్నికల కోడ్ ముగిసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత తాండూరు పట్టణంలోని రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగు వేసిన అధికారులు, కోడ్ ముగిసిన తరువాత ముసుగులను తొలగించడంలో నిర్లక్యం ప్రదర్శిస్తున్నారు. కోడ్ ముగిసి మూడు రోజులు అవుతున్నా నేతల విగ్రహాలకు ముసుగులు తీయడం లేదు. దీనిపై పలు పార్టీల రాజకీయ నాయకులు అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి నేతల విగ్రహాలకు ఉన్న ముసుగులు తొలగించాలని కోరుతున్నారు.