జై భజరంగ్..!
– తాండూరులో మార్మోగిన నామస్మరణ
– వైభవంగా హనుమాన్ జయంతి
– నేత్రపర్వంగా వీరహనుమాన్ శోభాయాత్ర
– పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: జై భజరంగ్, జై.. హనుమాన్.. నినాదాలతో తాండూరు పట్టణం మార్మోగింది. మంగళవారం తాండూరులో హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. రైల్వే స్టేషన్ హానుమాన్, సీతారాం పేట్ హానుమాన్, కన్యాపాఠశాల హనుమాన్ మందిరాలతో పాటు ఇతర ఆంజనేయ స్వామి దే వాలయాల్లోని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ ఉత్సవ సమితి, భజరంగ్ దళ్, విశ్వహిందూపరిషత్, స్టేషన్ హానుమాన్ భజనమండలిల సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన వీర హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ యాత్రలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, సాయిపూర్ బాల్ రెడ్డి, బంటు మల్లప్ప, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, కౌన్సిలర్లు అంతారం లలిత, సాహు శ్రీలత, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, బంటారం భద్రేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం స్టేషన్ హానుమాన్ మందిర్ నుంచి ఈ శోభాయాత్ర ప్రారంభమయ్యింది.


స్టేషన్ హనుమాన్, మార్వాడిబజార్, భద్రేశ్వరౌ చౌక్, గాంధీచౌక్, వినాయక చౌక్, ఇందిరాచౌక్, ఐలిరోడ్, రైల్వేకాలనీల మీదుగా ఈ యాత్ర ముందుకుసాగింది. ఈ శోభాయాత్రలో శ్రీ వీరాంజనేయ స్వామి, శ్రీరాముని విగ్రహ ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరోవైపు శోభాయాత్రలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

పూజలు చేసిన జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
తాండూరులో జరిగిన హనుమాన్ జయంతిలో వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని స్టేషన్ హనుమాన్ దేవాలయంలో ఆంజనేయ స్వామిని ఎస్పా కోటిరెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలో వెలసిన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డికి ఆలయ చైర్మన్ సంజీవరావు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఎస్పీ వెంట తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, సీఐలు సంతోష్ కుమార్, అశోక్ కుమార్, పోలీసులు అధికారులు ఉన్నారు.

శోభాయాత్రలో మజ్జిగ పంపిణీ
హనుమాన్ జయంతి శోభాయాత్రలో తాండూరు ఆర్యవైశ్య యువజన సంఘం చల్లని నీరు, మజ్జిగను పంపిణీ చేశారు. సంఘం సేవను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో సంఘం మాజీ, ప్రస్తుత అధ్యక్ష, కార్యదర్శులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

