కుల వృత్తుల పరిరక్షణలో విఫలం
– బీసీల జీవనోపాధికి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించాలి
– వృత్తిదారుల అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలి
– జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : కుల వృత్తుల పరిరక్షణలో ప్రభుత్వం విఫలం అవుతోందని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియొజక వర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు.

శనివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ కులాల సాంప్రదాయ వృత్తులను పరిరక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. మంగలి, చాకలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, వడ్డెర, స్వర్ణకారులు, దర్జీలు, ఉప్పర, బోయ,గౌడలు, నేతకారులు, కుర్మలు,మత్స్యకారుల వారి వృత్తులను ఆధునికీకరించే దిశగా ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించకపోవడం అత్యంత బాధాకరమన్నారు.

బీసీల అభివృద్ధి అంటే కేవలం సంక్షేమ పథకాల ప్రకటనలు చేయడం కాదని, సాంప్రదాయ వృత్తులకు ఆధునిక సాంకేతికతను అందించడం, తక్కువ వడ్డీ రుణాలు, ఆధునిక పనిముట్లు, ఉచిత నైపుణ్య శిక్షణ, మార్కెటింగ్ సదుపాయాలు, ప్రభుత్వ కొనుగోళ్లలో ప్రాధాన్యత, ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు వంటి చర్యలు చేపట్టినప్పుడే నిజమైన సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు.

ఎన్నికల సమయంలో బీసీల అభ్యున్నతి, వృత్తుల అభివృద్ధి, స్వయం ఉపాధికి పెద్దపీట వేస్తామని హామీలు ఇచ్చిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీసీ సాంప్రదాయ వృత్తుల పరిరక్షణకు ప్రత్యేక విధానాన్ని ప్రకటించి, ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలో బీసీ వృత్తిదారుల అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని, యువతకు ఉపాధి కల్పించే సమగ్ర కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు.


