నాణ్యమైన విత్తనాలతోనే అధిక ఉత్పత్తులు
– రైతుల ఆధాయాన్ని పెంచేందుకు ప్రాధాన్యం
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం ద్వారా పప్పుధాన్యాల ఉత్పత్తులు పెరుగుతాయని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

బుధవారం తాండూరు పట్టణంలోని డీసీఎంఎస్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఉచిత రెడ్గ్రామ్ కంది, మినుములు, పెసర్లు విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. రైతుల ఆధాయాన్ని పెంచేందుకు పథకాలు, కార్యక్రమాలను చేపడుతుందని అన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడం ద్వారా పప్పుధాన్యాల ఉత్పత్తి పెరుగుతుందని అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, నాణ్యమైన విత్తనాల వినియోగం వల్ల దిగుబడులు పెరిగి రైతులకు అధిక లాభాలు చేకూరుతాయని అన్నారు.

ప్రభుత్వం రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలను అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అన్నదాత సంతోషమే ప్రభుత్వ లక్ష్యం.. రైతు అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నీరజా బాల్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, ఆత్మ కమిటీ చైర్మన్ శంకర్ రెడ్డి, ఏడీఏ అరుణ, మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


