24గంటల్లో 38 ప్రసవాలు..!
– తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రికార్డు
– వెల్లడించిన ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రవిశంకర్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి మరో రికార్డును సృష్టించింది. 24 గంటల్లో 38 ప్రసవాలు నమోదయ్యాయి. బుధవారం ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రవిశంకర్ ఈ విషయాన్ని దృవీకరించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఒక రోజులో 25, 28 వరకు ప్రసవాలు జరిగేవని, కాని మంగళవారం ఒక్క రోజు 24 గంటల్లో 38 ప్రసవాలు జరిగాయన్నారు. ఇందులో 24 సాధారణ ప్రసవాలు జరిగాయి, మిగతావి సిజరియేషన్ అయ్యాయని వెల్లడించారు. ఇందుకు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శాలని, డాక్టర్ శరత్ చంద్ర, డాక్టర్ రోహిణి, డాక్టర్ శాంతి, డాక్టర్ రుబియాలతో వైద్య సిబ్బంది సేవలందించారని తెలిపారు. అదేవిధంగా జిల్లా ఆసుపత్రిలో మునుముందు కూడ అన్ని విభాగాలలో కార్పోరేట్ ఆసుపత్రిలకు ధీటుగా సేవలందిస్తామని పేర్కొన్నారు. దీంతో పాటు ఆసుపత్రిలో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా ఫిర్యాదు చేయాలని, వసూళ్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


