మొక్కలు నాటే బాధ్యత ప్రతి ఒక్కరిది
– పర్యావరణ పరిరక్షణే వన మహోత్సవ లక్ష్యం
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి పిలుపునిచ్చారు.

మంగళవారం తాండూరు పట్టణంలోని మెడికల్ కళాశాల (నర్సింగ్ కళాశాల) ఆవరణలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్రెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.

ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి పెద్ద చెట్టుగా పెంచినప్పుడే వన మహోత్సవం లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కల పెంపకాన్ని ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్, నర్సింగ్ కాలేజీ అధికారులు, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


