మట్టి గణేషునికి జై..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మట్టి గణేషునికి జై..!
– భారీ విగ్రహం వద్దు.. పర్యావరణమే ముద్దు
– పెద్దల మాటకు విలువ.. యువత స్పూర్తి 
– ఆదర్శంగా నిలుస్తున్న గుమస్తానగర్‌ ఉత్సవ కమిటీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక చవితి ఉత్సవాలంటే భారీ విగ్రహాలు.. హంగామా.. ఆర్భాటం అన్నట్లుగా మారుతున్న తరుణంలో గుమస్తానగర్‌ యువకులు మాత్రం పర్యావరణ పరిరక్షణకు స్ఫూర్తి దాయకంగా నిలిచారు. భారీ విగ్రహం ప్రతిష్టించే నిర్ణయాన్ని.. మానుకుని పెద్దల సూచనను పాటిస్తూ మట్టి గణపతిని ప్రతిష్ఠించేందుకు నిర్ణయించారు.

వార్డు నంబర్‌ 26 గుమస్తానగర్‌, విజ్ఞానపురి కాలనీలోని శ్రీ విద్యా వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 40 ఏండ్లుగా భారీ వినాయక విగ్రహం ప్రతిష్టించే వారు. ఈ ఏడాది 41వ సంవత్సరం వినాయక ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కాలనీ పెద్దలు చేసిన సూచన మేరకు కుల్కచర్ల వద్ద మట్టి విగ్రహాల తయారీదారు స్వామి వద్ద ఏడు అడుగుల గంగా మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాన్ని బుక్‌ చేశారు.

పూజల అనంతరం మట్టి విగ్రహం సులభంగా ప్రకృతిలో కలిసిపోయేలా ఉండటంతో పర్యావరణానికి మేలు జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. పెద్దల సూచనను ఆచరణలో పెట్టి.. పర్యావరణ పరిరక్షణకు తమవంతు బాధ్యతగా మట్టి గణపతిని ఎంచుకున్న గుమస్తానగర్‌ యువత పలువురి ప్రశంసలు అందుకుంటోంది.

వినాయక ఉత్సవాల్లో భక్తితో పాటు పర్యావరణ స్పృహను చాటుతున్న ఈ నిర్ణయం ఇతర ఉత్సవ కమిటీలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

మిస్సింగ్ సస్పెన్స్‌కు తెర..!