హామీలతో ప్రజలను మోసం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే
– ప్రజలు తిరస్కరించిన పైలెట్ రోహిత్రెడ్డికి మార్పు రాలేదు
– కాంగ్రెస్ అభివృద్ధిని ఓర్వలేకనే అసత్య ఆరోపణలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ ఆరోపించారు. గత బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన విషయాన్ని ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదన్నారు.

దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ హామీని అమలు చేయలేదని విమర్శించారు. దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి ఎంతమందికి ఇచ్చారో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి ఉద్యోగం, ఇంటికో ఉద్యోగం వంటి హామీల విషయంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు.

ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెప్పి అధికారానికి దూరం చేసినా ఆ పార్టీ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదని సంతోష్ మండిపడ్డారు. గత పాలనలో జరిగిన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు తెలుసని, అభివృద్ధి ఎవరి హయాంలో జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే బీఆర్ఎస్ నాయకులకు మరోసారి తగిన సమాధానం చెబుతారని కావలి సంతోష్ అన్నారు.


