శ్రీ సాయి మేధ పాఠశాలలో ఘనంగా గణనాథుడి నిమజ్జనోత్సవం

తాండూరు రాజకీయం వికారాబాద్

శ్రీ సాయి మేధ పాఠశాలలో ఘనంగా గణనాథుడి నిమజ్జనోత్సవం
– విద్యార్థుల కోలాటాలు, భక్తిగీతాలతో అలరించిన శోభాయాత్ర
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని శ్రీ సాయి మేధ పాఠశాలలో వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా గణనాథుడి నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

పాఠశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జనోత్సవ శోభాయాత్రను ప్రారంభించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని కోలాటాలు, భక్తిగీతాల ఆలాపన, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించడంతో శోభాయాత్ర భక్తి వాతావరణాన్ని సంతరించుకుంది.

విద్యార్థుల క్రమశిక్షణతో కూడిన ప్రదర్శనలు, కోలాటాలు, భక్తిగీతాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.గణనాథుడిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ఉంచి పట్టణంలోని ప్రధాన పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినాదాలు చేస్తూ భక్తిశ్రద్ధలతో ముందుకు సాగారు.

అనంతరం గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చే కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించి, నిమజ్జనోత్సవాన్ని ఘనంగా ముగించారు.ఈ సందర్భంగా కరస్పాండెంట్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. వినాయక చవితి వంటి పండుగల ద్వారా విద్యార్థుల్లో భక్తి, సంస్కృతి, సంప్రదాయాలు, ఐక్యత, పర్యావరణ పరిరక్షణ వంటి విలువలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

పోయిరావయ్య.. గణపయ్య..!