వరద ముప్పు నియంత్రణపై దృష్టి
– మల్కాపూర్ గ్రామ సర్పంచ్ విజయలక్ష్మీ పండరి
– గ్రామ బ్రిడ్జి వద్ద మట్టి, ముళ్ల పొదల తొలగింపు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : వర్షాల వల్ల ప్రజలకు గ్రామంలో వరద, ముంపు ఇబ్బందులు రాకుండా దృష్టిసారిస్తున్నట్లు తాండూరు మండలం మల్కాపూర్ గ్రామ సర్పంచ్ విజయలక్ష్మీ పండరి పేర్కొన్నారు. సోమవారం గ్రామ సమీపంలోని బ్రిడ్జి వద్ద కెనాల్లో మట్టిని తవ్వించారు. వరద ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న ముళ్ల పొదలను తొలగింపు చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ విజయలక్ష్మీ పండరి మాట్లాడుతూ రెండేళ్ల నుంచి భారీ వర్షాల వల్ల గ్రామంలోని భవానీ నగర్ లోకి వరద నీరు ముంచెత్తుందన్నారు.
దీని వల్ల కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గత వేసవిలోనే బ్రిడ్జీ వద్ద ముంపు నియంత్రణ చర్యలు తీసుకుమన్నామని గుర్తుచేశారు. ఇటీవల గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరోసారి ముంపు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా మరోసారి బ్రిడ్జి వద్ద ముళ్ల పొదల తొలగింపు, నీటీ ప్రవాహనానికి మట్టి తవ్వకాలు చేపట్టడం జరిగిందన్నారు. గ్రామంలో వరధ ఇబ్బందులు రాకుండా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాపూర్ గనికార్మిక సంఘం డైరెక్టర్ ఎస్.పండరి, గ్రామ ఉప సర్పంచ్ అబ్దుల్ మజీద్, గ్రామస్తులు ఉన్నారు.



